Costliest Number Plate: రీసెంట్ గా HR 88 B 8888 నెంబర్ ప్లేట్ మీద దేశ వ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొద్ది రోజుల క్రితం హర్యానా రవాణాశాఖ నిర్వహించిన వేలంలో సుధీర్ కుమార్ అనే వ్యక్తి రూ.1.17 కోట్లకు కొనుగోలు చేశాడు. అయితే, నిర్ణీత గడువులోగా డబ్బును చెల్లించలేకపోయాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రవాణాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నెంబర్ ప్లేట్ కు మరోసారి వేలం నిర్వహించాలని భావిస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
రొములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్.. ఇటీవల జరిగిన నంబర్ ప్లేట్ బిడ్డింగ్లో పాల్గొని రూ.కోటి 17 లక్షలకు HR 88 B 8888ను దక్కించుకున్నాడు. కానీ, ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో హర్యానా ప్రభుత్వం అతడి ఆస్తులపై దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్.. సుధీర్ ఆదాయం, ఆస్తులపై విచారణకు ఆదేశించారు. అతడి సెక్యూరిటీ డిపాజిట్ గా ఉన్న రూ.11,000ను తక్షణమే జప్తు చేయాలని స్పష్టం చేశారు. సదరు వీఐపీ నంబర్ ప్లేట్ కోసం బిడ్ వేసేందుకు కావాల్సిన నికర మొత్తం అతడి దగ్గర ఉందో లేదో తనిఖీ చేయాలని సూచించారు. ఈ విషయమై ఆదాయపు పన్ను శాఖకు కూడా లేఖ రాస్తానని మంత్రి విజ్ వెల్లడించారు. డబ్బుల ఏకపోయినా, బిడ్డర్లు ఇష్టానుసారంగా నంబర్ ప్లేట్ల ధరను పెంచకుండా ఉండేందుకు చర్యలు చేపడతామన్నారు. వేలంలో బిడ్డింగ్ వేయడమనేది హాబీ కాదు.. బాధ్యతగా నిర్వర్తించాలన్నారు.
ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కు మరోసారి వేలం..
వీఐపీ నంబర్ ప్లేట్ వేలం పూర్తయ్యాక కావాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు డిసెంబర్ 1 వరకూ గడువు ఉంది. అయితే అప్పటివరకూ సుధీర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. దాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ నగదు చెల్లించేందుకు ఆఖరి నిమిషం వరకూ ప్రయత్నించానని, కానీ సఫలం కాలేకపోయానని సుధీర్ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన అలాట్మెంట్ ను రద్దుచేసి మరోసారి ఆ నంబర్ను వేలంలో ఉంచుతున్నట్టు అక్కడి రవాణా అధికారులు స్పష్టం చేశారు. ఈసారి ఎంత ధర పలుకుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





