
క్రైమ్ మిర్రర్, శ్రీకాళహస్తి : ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబం తరఫున ఆలయంలో ప్రైవేటుగా నిర్వహించిన నవగ్రహ శాంతి పూజల వ్యవహారం వివాదంగా మారింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు సీరియస్గా స్పందించారు.
ఆలయంలో విధివిధానాలకు విరుద్ధంగా ప్రత్యేక అనుమతి లేకుండా పూజలు నిర్వహించిన అర్చకుడిపై అధికారులు విచారణ చేపట్టి, చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆలయ పబ్లిక్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉన్నదిగా పేర్కొంటూ, ప్రముఖులకు ప్రైవేట్ పూజలు జరిపినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అర్చకుని వైఖరిపై ఆలయ పాలక మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించి, అంతర్గత విచారణ ప్రారంభించనున్నారు.
ఈ ఘటనపై పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిబంధనలను సమస్త భక్తులకు సమానంగా పాటించాల్సిన అవసరం ఉందని, ప్రముఖులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.