
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు: “స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పిఓలు, ఏపీవోలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్వం సిద్ధంగా ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ చాలా ముఖ్యమైందని, ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు.
ఆర్ఓలు, ఏఆర్వోలు ఈ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో రెండో విడత శిక్షణా కార్యక్రమంతో పాటు, ఎన్నికల సంఘం సూచనల మేరకు శిక్షణపై పరీక్ష కూడా నిర్వహించబడుతుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ విధానంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, పోలింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ, రికార్డు నిర్వహణ తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారని చెప్పారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని పిఓలు, ఏపీవోలకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ శ్రీనివాస్, సిపిఓ బాబురావు, భూపాలపల్లి ఎంపీడీవో నాగరాజు, ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.