
సీఎం రేవంత్రెడ్డి.. తన జైలు జీవితాన్ని ఒకసారి గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా.. తన ఆవేదన చెప్పుకున్నారు. గత ప్రభుత్వం.. తనను జైల్లో పెట్టి ఎంత నరకం చూపించిందో కళ్లకు కట్టినట్టు చెప్పారు. అసలు ఆయన.. సభలో అప్పటి రోజులను ఎందుకు గుర్తుచేసుకున్నారు..? ఇప్పుడెందుకు అంత ఆవేదనగా మాట్లాడారు…? అసలు ఏం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఏమన్నారో.. ఒకసారి చూద్దాం.
బీఆర్ఎస్ హయాంలో తనను 16 రోజులు జైల్లో నిర్బంధించి… ఎవరినీ కలవనివ్వకుండా వేధించారని చెప్పారు సీఎం రేవంత్రెడ్డి. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసినందుకు.. కేసు పెట్టారని చెప్పారు. 500 రూపాయల ఫైన్తో… స్టేషన్ బెయిల్ రావాల్సిన కేసులో… అధికార దుర్వినియోగం చేసి తనను జైలుకు పంపారన్నారు రేవంత్రెడ్డి. చర్లపల్లి జైల్లో నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఉంచారన్నారు. ఏడు అడుగుల గదిలో… మూడున్నర అడుగులు పడుకునే దిమ్మె.. చిన్న బాత్రూమ్ మాత్రమే ఉన్నాయని.. ఆ గదిలో 16 రోజులు ఉంచారని చెప్పారు. ఒక్క ఖైదీ కూడా కనిపించకుండా.. ఎవరినీ కలవనివ్వకుండా తనను నిర్బంధించారని అన్నారు. నన్ను వేధించారన్న కోపం ఉన్నా… ఆ కోపాన్ని దిగమింగుకుని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానని చెప్పారు సీఎం రేవంత్రెడ్డి.
రాత్రి నిద్రపోయే సమయంలో కూడా లైట్లు ఆర్పకుండా వేధించారన్నారు. ట్యూబ్లైట్ల చుట్టూ పురుగులు తిరుగుతుంటే… వాటిని తినడానికిపెద్ద పెద్ద బల్లులు వస్తుంటే.. ఒక్క రాత్రి కూడా నిద్రపోకుండా కూర్చున్నానని చెప్పారు. లైట్లు ఆపమని కానిస్టేబుల్కు చెప్పినా… పై నుంచి ఆదేశాలు ఉన్నాయి… ఆపడం కుదరదని చెప్పారన్నారు. రాత్రిళ్లు నిద్రలేకుండా.. పొద్దున గది నుంచి బయటకు వదిలినప్పుడు.. చెట్టు కింద నిద్రపోయానన్నారు. తనను అన్ని కష్టాలు పెట్టినా… కోపం ప్రదర్శించడంలేదన్నారు రేవంత్రెడ్డి. ఇప్పుడు పవర్ ఉందికదా అని కక్ష సాధింపు చర్యలకు దిగడంలేదని చెప్పారాయన. దేవుడు ఉన్నాడు… తనను ఇబ్బంది పెట్టినోళ్లను ఆయనే చూసుకుంటారని జైల్లో ఉన్నప్పుడే అనుకున్నానని చెప్పారు. అనుకున్నట్టుగానే… తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే… తనను ఇబ్బంది పెట్టిన వాళ్లు.. ఆస్పత్రిలో చేరారన్నారు.
Also Read : భట్టి విక్రమార్కకు ప్రమోషన్ – డ్రాఫ్టింగ్ కమిటీలో చోటు
కూతురి పెళ్లి ఉన్నా… తనకు మధ్యంతర బెయిల్ రాకుండా చేశారనన్నారు సీఎం రేవంత్రెడ్డి. కోర్టు కండిషనల్ బెయిల్ ఇస్తే.. కూతురి పెళ్లి లగ్నపత్రిక రాసుకుని.. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు వెళ్లానని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులు అని మాట్లాడేవారు… ఆ కక్ష సాధింపులు చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలన్నారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి… కిరాయి మనుషులను పెట్టించి.. పచ్చి బూతులు మాట్లాడించినా… తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు సీఎం రేవంత్రెడ్డి. తాను కక్ష సాధించాలని అనుకుని ఉంటే… ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరు కూడా బయట తిరిగేవారు కాదని.. అందరూ చర్లపల్లి జైల్లో ఉండేవారన్నారు.