బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘటన విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రెడీ అవుతోంది మరో రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలుకానుంది. నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలతో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు విడివిడిగా సమావేశమవుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలంతా పాట్నా చేరుకోగానే చర్చలు మొదలవుతాయి.
నవంబర్ 22న ముగియనున్న అసెంబ్లీ గడువు
బీహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 18వ అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. ప్రమాణస్వీకారం తేదీ ఖరారుపై చర్చిస్తారు.
డిప్యూటీ సీఎంగా చిరాగ్ పాశ్వాన్!
బీహార్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ ను కూటమి నేత, లోక్జనశక్తి పార్టీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కలిశారు. చారిత్రక విజయం నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎంను అభినందించినట్టు పాశ్వాన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 19 స్థానాలను ఎల్జేపీ (రామ్విలాస్) గెలుచుకుంది. ఈ నేపథ్యంలో నితీశ్ను కలవడం ద్వారా పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిపై పాశ్వాన్ దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా బీహార్ లో నితీశ్, కేంద్రంలో మోడీ అంటూ ప్రచారం సాగించిన ఎన్డీయే అధికారికంగా నితీశ్ను సీఎంగా ప్రకటించాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రిగా చిరాగ్ కు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం చిరాగ్ మోదీ సర్కారులో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా కొనసాగుతున్నారు. మోదీకి తాను హనుమంతుడిగా చెప్పుకునే చిరాగ్ కచ్చితంగా ఆయన మద్దతుతో బీహార్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.





