* సుప్రభాత సేవతో ప్రారంభమైన వేడుకలు
* ఇవాళ సింధూర లేపనము, సామూహిక హోమాలు,
* 27న సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం
క్రైమ్ మిర్రర్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కనగల్లు మండలం చిన్నమాధారం గ్రామ పరిధిలోని కుమ్మరిగూడెంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు వేడుకల్లో భాగంగా బుధవారం నాడు ఉదయం 7 గంటలకు సుప్రభాతం, మామిడాకు తోరణం, గోపూజ, 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రాయశ్చిత్తం, ఆచార్యాది ఋత్వగ్వ రుణం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, సర్వతోభద్ర మండపారాధన జరిగాయి. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి 108 అష్టోత్తర కలశాభిషేకం చేశారు. అనంతరం అగ్నిప్రతిష్ఠాపన, గణపతి హోమం, మండప హోమాలు జరిగాయి. సాయంత్రం 7 గంటలకు మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవాళ సింధూర లేపనం, సామూహిక హోమాలు
ఇక రెండవ రోజు అయిన ఇవాళ ఉదయం 8 గంటలకు నిత్యపూజలు, పంచామృతాభిషేకం, స్వామివారికి సింధూర లేపనం చేయనున్నారు. 11 గంటలకు సామూహిక హోమాలు, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి విశేష అర్చన, రాత్రి 7 గంటలకు మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ చేయనున్నారు. మూడవ రోజు మార్చి 27న ఉదయం 7 గంటలకు సుప్రభాతం, 10 గంటలకు శ్రీ సీతారామ చంద్రస్వామి దివ్య కళ్యాణ మహోత్సము జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ జరగనుందని ఆలయ భక్త మండలి సభ్యులు వెల్లడించారు.
