* మరో రెండు నెలలు ఆగాల్సిందే
* ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ తరువాతనే..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ విస్తరణ ఎప్పుడు? ఇప్పుడు ఉన్న మంత్రులను కొనసాగిస్తారా? ఎవరిని తొలగిస్తారు? ఎవరికి ఛాన్స్ ఇస్తారు? అనే అంశాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఏప్రిల్ లో విస్తరణ ఉంటుందని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ హై కమాండ్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో.. తెలంగాణలో చేర్పులు మార్పులపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే హై కమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రానికి చెందిన మంత్రులు కేరళ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇటువంటి కీలక సమయంలో క్యాబినెట్ విస్తరణ చేపడితే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే తాత్కాలికంగా ఈ విస్తరణ అంశాన్ని కాంగ్రెస్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి.. ఫలితాలు వెలువడిన తర్వాతే తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. అయితే ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. హై కమాండ్ పెద్దలకు టచ్ లోనే ఉన్నారు.
భారీగా ప్రక్షాళన..
మరోవైపు భారీగా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందన్న ప్రచారంతో ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా కలవరపాటుకు గురవుతున్నారు. ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీకి మాత్రమే పరిమితం కాకుండా.. రేవంత్ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిగా మంత్రుల పనితీరుపై ఒక నివేదిక ఇప్పటికే సిద్ధం చేశారట. శాఖల వారీగా సాధించిన పురోగతి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మంత్రులపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నారట. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం బట్టి క్యాబినెట్ లో ఉన్న ఓ ముగ్గురు మంత్రులను తొలగిస్తారని తెలుస్తోంది. పనితీరు బాగా లేని వారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తారని సమాచారం.
ఆశావహులు అధికం..
మంత్రివర్గంపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఆశావహులు ఎక్కువమంది ఉన్నారు. అయితే అన్ని కోణాల్లో, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా బీసీలతో పాటు తెలంగాణలో అధికంగా ఉండే లంబాడ వర్గానికి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్,రంగారెడ్డి, హైదరాబాదులకు ప్రాతినిధ్యం పెంచే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహమ్మద్ అజారుద్దీన్ పై పడింది. ప్రస్తుతం ఆయన చట్టసభల్లో సభ్యుడు కారు. ఆరు నెలల కిందట జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఆయనను మంత్రిగా తీసుకున్నారు. ఒకవేళ ఈనెల 30తో ఆయన ఎమ్మెల్సీ కాకుంటే మాత్రం పదవి పోయినట్టే. మరోసారి ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. నామినేటెడ్ పదవితో సరిపెడతారని సమాచారం. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మే దాటుతుంది. అంటే మరో రెండు నెలలు వెయిట్ చేయక తప్పదు అన్నమాట.
