తెలంగాణ

కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు?

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు ఇప్పుడు బయటపడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కొంతమంది నేతలకు పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయనే చర్చ నడుస్తోంది. దీనికి నిదర్శనం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాపు అని చెప్పొచ్చు.

కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాపు చెప్పుకునేంత స్థాయిలో జరగలేదనేది అక్కడ హాజరైన నేతల తీరును బట్టే అర్థమవుతోంది. తప్పని సరిగా ఈ వర్క్ షాపుకు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలున్నా కొంతమంది నాయకులు వాటిని బేఖాతరు చేశారు. ఆ మీటింగ్ కు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అన్న చందంగా వ్యవహరించారు. మెజార్టీ ప్రజాప్రతినిధులు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాపుకు హాజరుకాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పైకి ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలిస్తున్నప్పటికీ.. కిషన్‌రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

బీజేపీ వర్క్ షాపునకు ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రఘునందన్ లు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. పదకొండు మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు గాను మొత్తంగా నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఎంపీలల్లో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా, ధర్మపురి అరవింద్, గోడం నగేశ్ లు వర్క్ షాపుకు దూరంగా ఉన్నారు. ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో ఉండగా, బీజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పర్యటనలో ఉన్నారు. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం బీజేపీలో చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button