రామకృష్ణాపూర్ ఫిబ్రవరి 2 (క్రైమ్ మిర్రర్): మున్సిపల్ ఎన్నికల వేళ క్యాతనపల్లి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. మంత్రి వివేక్ గెలుపు కోసం అడుగడుగునా కష్టపడి పనిచేసిన మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు బింగి శివాని శివకిరణ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.
సోమవారం హైదరాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన జాగృతి తీర్థం పుచ్చుకున్నారు. శివకిరణ్తో పాటు జంగంపల్లి మల్లయ్య,పలువురు యువకులు కూడా జాగృతిలో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కలేదన్న కారణంతో సార్వత్రిక ఎన్నికల ముందు చెన్నూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ పై తిరుగుబాటు బావుట ఎగురవేసింది శివ కిరణే.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.మున్సిపాలిటీ లో పార్టీ బలోపేతానికి శివకరణ్ ఎంతో చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి వివేక్ గెలుపు కోసం అడుగడుగునా కష్టపడ్డాడు. . అయితే, మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలో ఆయన సేవలను విస్మరించడం, సీనియారిటీని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాలతో మనస్తాపానికి గురైన ఆయన, తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించుకున్నారు.
శివకిరణ్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “అధికారానికి దగ్గరైన వారికే అవకాశాలు కల్పిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాటం చేసిన వారిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం?” అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
పార్టీకి విధేయుడుగా పనిచేసిన నాయకులను ఎన్నికల సమయంలో దూరం చేసుకోవడం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.శివకిరణ్ వంటి బలమైన నాయకుడు చేరడంతో క్యాతనపల్లిలో తెలంగాణ జాగృతికి కొత్త బలం చేకూరినట్లయింది. ఆయన వెంట వెళ్లిన యువత, జంగంపల్లి మల్లయ్య వంటి నాయకులతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.





