తెలంగాణ

BIG ALERT: భీకరమైన చలి.. ప్రజలు జాగ్రత్త.. స్కూల్ టైమింగ్స్ కూడా మార్పు

BIG ALERT: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగి ప్రజలను గడగడలాడిస్తోంది.

BIG ALERT: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగి ప్రజలను గడగడలాడిస్తోంది. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ.. రాత్రి, తెల్లవారుజామున సమయంలో మాత్రం చలి పులి పంజా విసురుతున్నట్లు పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో చలి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో చలి అత్యధికంగా నమోదవుతూ సాధారణ జీవనాన్ని ప్రభావితం చేస్తోంది.

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈ జిల్లాల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యు ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సాధారణం కంటే దాదాపు 5.7 డిగ్రీలు తగ్గి 6.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడంతో ప్రజలు తీవ్రమైన చలితో వణికిపోతున్నారు. హనుమకొండ, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో కూడా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చలి ప్రభావంతో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుని రహదారులపై దృశ్యమానత తగ్గుతోంది. దీంతో వాహనదారులు కూడా అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. నేడు మరియు రేపు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐదు జిల్లాలను మినహాయించి మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేనప్పుడు ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీవ్రమైన చలిని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వైద్య నిపుణులు కూడా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె, ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున, రాత్రి వేళల్లో వీలైనంతవరకు బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మఫ్లర్లు ధరించాలని, చెవులు కప్పుకునేలా హెడ్ క్యాప్ వాడాలని చెబుతున్నారు.

చల్లని గాలి నేరుగా శ్వాసకోశంలోకి వెళ్లకుండా మాస్క్ ధరించడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవడానికి వేడి పానీయాలు, పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి లోపల గాలి చొరబడకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. రాత్రి పడుకునే సమయంలో మందపాటి దుప్పట్లు వాడడం ద్వారా చలి నుంచి రక్షణ పొందవచ్చు.

హీటర్లు వాడుతున్నట్లయితే గదిలో సరిపడా గాలి ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఊపిరాడక ప్రమాదాలు జరిగే అవకాశముందని సూచిస్తున్నారు. చలికాలంలో చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడటం మంచిది. ఏదైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే స్వయం వైద్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రాబోయే రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి చలి ప్రభావం నుంచి కాపాడుకోవాలని అధికారులు, వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.

ALSO READ: Horoscope: ఇవాళ వీరికి అదృష్ణ ఫలాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button