ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు
ఖమ్మం, క్రైమ్ మిర్రర్:తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. నేడు కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని.. వడ గాలులు వీచే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు
మార్చి మెుదటి వారం నుంచే భానుడి భగభగలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది తర్వాత రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్ నగరంలో పాటు చాలా జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని చెప్పారు.ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉండటం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని.. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రమైన ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుందన్నారు.
ఆ సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల మార్కును దాటాయని చెబుతున్నారు. నేడు ఈ జిల్లాల్లో పొడి గాలులు వీచే అవకాశం ఉందని.. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణిలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
