
Betul: మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మరోసారి ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. ఓ వ్యక్తి తన సొంత ఆవుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర ఉద్రేకానికి దారి తీసింది. వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో పాటు హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. ఈ ఘటన ఒక్క వ్యక్తి చేసిన నేరం దగ్గర ఆగకుండా, పెద్ద ఎత్తున హింస, ఆస్తి విధ్వంసానికి కారణమైంది.
దామ్జీపురా ప్రాంతంలో నిందితుడికి చెందిన పంక్చర్ షాప్ను లక్ష్యంగా చేసుకున్న ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆ షాప్తో పాటు సమీపంలో ఉన్న మరో ఏడు దుకాణాలను తగులబెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఎలక్ట్రికల్ షాప్, సెలూన్, మొబైల్ స్టోర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులు నాలుగు కార్లు, నాలుగు బైక్లను ధ్వంసం చేయడమే కాకుండా, ఒక నివాస గృహాన్ని కూడా పూర్తిగా నాశనం చేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేలోపే లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఘటన తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. వదంతులు, అసత్య ప్రచారాల వల్లే ఈ స్థాయిలో హింస చెలరేగిందని బేతుల్ ఎస్పీ వీరేంద్ర జైన్ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శాంతి భద్రతలను కాపాడేందుకు పొరుగు జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలను రప్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ఇంకా ఉద్రిక్తత నెలకొని ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
ఇక ఆవుపై జరిగిన అఘాయిత్యం అంశంపై ఒక కేసు, ఆందోళనల సమయంలో జరిగిన ఆస్తి నష్టం, దాడులపై మరో కేసుగా పోలీసులు వేర్వేరుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చట్ట ప్రకారం నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ALSO READ: Murder: కోడలు అక్రమ సంబంధం.. మామపై దారుణం!





