కడప, క్రైమ్ మిర్రర్ :ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లెలమ్మ పల్లి గ్రామంలో ఎస్.ఐ శ్రీప్రియ రి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్థులతో సమావేశం నిర్వహించి.. వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును ప్రజలకు వివరించి, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుండి బయటకు వెళ్ళ వద్దని, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారని, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసారని, మీ పిల్లలపై డ్రగ్స్ కేసు నమోదయ్యిందని, సీబీఐ లేదా ఎన్ఫోర్స్మెంట్్ లేదా సిఐడి లేదా కోర్టు నుండి అధికారులుగా పరిచయం చేసుకొని, బెదిరింపులకు పాల్పడుతుంటారని, చివరకు సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి, అమాయకుల నుండి డబ్బులను కొల్లగొడుతున్నారన్నారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోన్ కాల్ వస్తే సమాచారాన్ని డయల్ 112 లేదా 1930కు అందించాలని ఎస్.ఐ సూచించారు.
పిల్లలను బాగా చదివించుకోవాలని, ఉత్తమ మార్గంలో నడిపి, ఉన్నత స్థానాలకు చేరుకొనే విధంగా చూడాలన్నారు. చదువుకొనే సమయంలో మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడకుండా ఒక కంట కనిపెట్టాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. చిన్నచిన్న విషయాలకు ఆవేశాలకు లోనుకాకుండా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
