హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నియమిస్తూ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం.
Also Read:భారీ వర్షాలు….. ఆదర్శంగా నిలిచిన దేవరకొండ కోర్టు సిబ్బంది
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మైనారిటీ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, హైదరాబాద్ నగరంలో పార్టీ స్థాయిని మరింత బలపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నియామకం ఇప్పటికే కేబినెట్లో ఆమోదం పొందింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ఆయనను మంత్రివర్గంలోకి చేర్చే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read:పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన… ఆశ్చర్యపోయిన బంధువులు
రాష్ట్ర కేబినెట్ విస్తరణ రెండు రోజుల్లో జరగనుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో అజారుద్దీన్ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ అంతర్గత చర్చల ప్రకారం, ఆయనకు క్రీడా, మైనారిటీ సంక్షేమ శాఖలలో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, మాలక్పేట్, చార్మినార్ వంటి పట్టణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పట్టు బలహీనంగా ఉందనే అంచనాల మధ్య అజారుద్దీన్ నియామకం మైనారిటీ ఓటు బ్యాంకును ఆకర్షించే దిశగా కీలక అడుగుగా పార్టీ భావిస్తోంది.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, అజారుద్దీన్ వంటి జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేతను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ తన జాతీయ ఇమేజ్ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది, అని చెబుతున్నారు. రెండు రోజుల్లో జరగబోయే కేబినెట్ విస్తరణ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుంది. అజారుద్దీన్ ప్రమాణస్వీకారం జరిగితే, ఇది మైనారిటీ వర్గంలో కాంగ్రెస్కు పెద్ద ఊతంగా మారవచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
Also Read:భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి : ఎస్ఐ యుగంధర్ గౌడ్





