Ayodhya Ram Temple: అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులన్నీ ఏప్రిల్ 30వ తేదీతో పూర్తికానున్నట్టు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 19న అయోధ్యలో పర్యటించనున్నారని, ఇందుకు రాష్ట్రపతి తమ సమ్మతి తెలిపారని చెప్పారు. రూ.1,900 కోట్ల అంచనా వ్యయంతో రామాలయ నిర్మాణం పనులు సాగుతున్నాయి.
రూ. 1,900 కోట్లతో రామాలయ నిర్మాణం
రామాలయ నిర్మాణ కమిటీతో రెండ్రోజుల పాటు సమావేశమైన అనంతరం నృపేంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, ఆలయ నిర్మాణ పనులకు ఎల్ అండ్ టీ, టాటా కన్సల్టెన్సీలతో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నామని, ఏప్రిల్ 30వ తేదీకి నాటికి పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ఆ రోజుకు అన్ని పేపర్ వర్క్ లతో పాటు బిల్ పేమెంట్ ప్రొసీజర్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. దాంతో ఆలయం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. రామాలయ ప్రాజెక్టుకు రూ.1,900 కోట్ల ఖర్చును అంచనా వేయగా, జీఎస్టీతో సహా రూ.1,600 కోట్లు ఇప్పటికే చెల్లించామని మిశ్రా వివరించారు.





