హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియా యుద్దం కారణంగా అన్నిరంగాలపై తీవ్రప్రభావం చూపుతుంది.తాజాగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం కొనసాగుతున్న ఎల్పీజీ, సీఎన్జీ కొరతను నిరసిస్తూ ఆటో డ్రైవర్లు భారీ ఆందోళన చేపట్టారు. నగరంలోని ఫిల్లింగ్ స్టేషన్లలో నిల్వలు నిండుకోవడంతో ఆటోలు గ్యాస్ కోసం కిలోమీటర్ల మేర క్యూకడుతున్నాయి. ఒక్కోసారి 5గంటల నుంచి 6గంటల వరకు వేచి చూసిన గ్యాస్ దొరకడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ లేకపోవడంతో ఆటోలు నడుపలేక, రోజువారి అద్దెలు కట్టలేక, తమ కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ వద్ద ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒక్కసారిగా సెల్టవర్ ఎక్కి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. గ్యాస్ సరఫరాను పునరుద్దరించాలని లేని పక్షంలో దూకేస్తామని హెచ్చరించారు. కాగా తోటి డ్రైవర్లు వారికి మద్దతుగా రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు చేరుకొని గ్యాస్ సిలిండర్ కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రెండు గంటల హైడ్రామా తరువాత వారికి నచ్చచెప్పడంతో కిందకు దిగారు. ఈ ఆందోళనతో అత్తాపూర్ మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.
