మహారాష్ట్రలోని నాసిక్ లో దారుణ ఘనట బయటపడింది. సమాజాన్నిఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. జ్యోతిష్యం పేరుతో విశ్వాసాన్ని దుర్వినియోగం చేసిన ఓ వ్యక్తి చేసిన ఘోరాలు వెలుగులోకి రావడంతో ప్రజలు షాక్కు గురవుతున్నారు. 67 ఏళ్ల అశోక్ ఖరత్ అనే ఈ జ్యోతిష్యుడు, తన దగ్గరికి వచ్చే మహిళలను మోసం చేసి లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు
పోలీసుల సమాచారం ప్రకారం, ఖరత్ తనను దైవిక శక్తులు కలిగినవాడిగా ప్రచారం చేసుకొని, భవిష్యత్తు గురించి భయపెట్టి మహిళలను తన వద్దకు రప్పించేవాడు. ‘జీవితంలో ప్రమాదాలు తప్పవు’, ‘పూజలు చేయకపోతే కష్టాలు వస్తాయి’ వంటి మాటలతో వారిని నమ్మించేవాడు. ఆ తరువాత పూజల పేరుతో మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
ఇంతటితో ఆగకుండా, ఆ దారుణాలను రహస్యంగా చిత్రీకరించి వీడియోల రూపంలో భద్రపరచేవాడు. ఆ వీడియోలను చూపించి బాధితులను బ్లాక్మెయిల్ చేస్తూ, పదేపదే లైంగిక దాడులకు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు కనీసం 58 మంది మహిళలు ఈ మోసానికి బలైనట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ దారుణం వెలుగులోకి రావడానికి కారణం ఓ 35 ఏళ్ల మహిళ ధైర్యంగా ముందుకు రావడమే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఖరత్ కార్యాలయంపై దాడి చేసి, కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. పెన్డ్రైవ్లలో బాధితుల వీడియోలు ఉండటం ఈ కేసు తీవ్రత మరింత పెరిగింది.
ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్
ఘటనపై సమగ్ర విచారణ కోసం ఐపీఎస్ అధికారి తేజస్విని నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశ్వాసం పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
