* తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు
* జనగణన తరువాత ప్రారంభం కానున్న ప్రక్రియ
క్రైమ్ మిర్రర్, ఏపీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయా? పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయా? నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభం కానుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల్లో జనగణన ప్రారంభం కానుంది. అయితే ఇది పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే 2029 ఎన్నికలకు పునర్విభజన చేస్తారా? లేకుంటే తరువాత ఎన్నికలకు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. చివరిగా మాత్రం 2009లో పునర్విభజన జరిగింది. అటు తరువాత అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు తప్ప పునర్విభజన చేయలేదు. జనగణనకు ముడిపెడుతూ ఎప్పటికప్పుడు ఈ పునర్విభజన ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు..
పుష్కరకాలం కిందట..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది. అప్పట్లోనే కొత్త నియోజకవర్గాల ఏర్పాటు పై చర్చ నడిచింది. రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన హామీల్లో సైతం పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 117 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఏపీలో ఒక 50 వరకు అసెంబ్లీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అదే తెలంగాణలో ఓ 30 సీట్లు వరకు పెరుగుతాయన్న అంచనా ఉంది. కానీ 12 సంవత్సరాలు అవుతున్న పునర్విభజన జరగలేదు. దానికి కారణం జనగణన జరగకపోవడమే.
15 ఏళ్ల కిందట జనగణన..
చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ జనగణన జరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన 2021లో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా జరగలేదు. ఇంతలో 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. అందుకే ఇప్పుడు జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రెండు విడతల్లో జన గణన జరగనుంది. ఇది పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
2009లో చివరిసారిగా..
2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన దోహద పడిందన్న కామెంట్స్ వినిపించాయి. అప్పట్లో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ తనకు అనుకూలంగా నియోజకవర్గాలను పునర్విభజన చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ నియోజకవర్గాల పునర్విభజనతో అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటుందన్న అభిప్రాయం ఉంది. ప్రధానంగా ఏపీలో కూటమి లో మూడు పార్టీలు ఉన్నాయి. ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. 50 అసెంబ్లీ సీట్లు పెరిగితే మాత్రం కచ్చితంగా అది కూటమికి ప్రయోజనకరమే. చూడాలి మరి ఏం జరుగుతుందో?
