Tuesday, February 17, 2026
Homeతెలంగాణరైతుల కోసం మరో కొత్త పథకం.. భారీగా నిధుల విడుదల

రైతుల కోసం మరో కొత్త పథకం.. భారీగా నిధుల విడుదల

తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణను ప్రోత్సహించడమే లక్ష్యంగా జనవరి నెల నుంచి కొత్త వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను కూడా ఇప్పటికే విడుదల చేయడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ కోసం రూ.101.83 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

ఈ పథకంలో కేంద్రం, రాష్ట్రం కలిసి నిధులు సమకూర్చనుండగా కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాను అందించనుంది. మిగతా 40 శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. ఈ నిధుల ద్వారా రైతులకు అవసరమైన వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను సబ్సిడీపై అందించనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మారేందుకు ఇది కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ పనిముట్లపై రైతులు గరిష్టంగా 50 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఈ పథకం ద్వారా కల్పించనున్నారు.

ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ వర్గాలకు చెందిన మహిళా రైతులు వ్యవసాయ పనిముట్లపై 50 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉండగా, ఇతర వర్గాలకు చెందిన రైతులకు 40 శాతం వరకు సబ్సిడీ అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, తొలి దశలో 1.30 లక్షల మంది రైతులను ఎంపిక చేశారు. ఎంపికైన రైతులకు త్వరలోనే సబ్సిడీ సౌకర్యం కల్పించనున్నారు.

వ్యవసాయానికి అవసరమయ్యే అనేక రకాల పనిముట్లు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ట్రాక్టర్ అనుబంధ పరికరాలు, విత్తనాలు నాటే యంత్రాలు, పంట కోతకు ఉపయోగించే పరికరాలు వంటి వాటిపై రైతులకు రాయితీ లభించనుంది. ప్రభుత్వం నిధులు నేరుగా జమ చేయడం వల్ల రైతులకు తక్కువ ధరకే యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పెట్టుబడి భారం తగ్గి, వ్యవసాయ ఖర్చులు తగ్గే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకుముందు ప్రభుత్వం యంత్రాలను స్వయంగా కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందించేది. అయితే ఇప్పుడు విధానంలో మార్పులు చేసి రైతులు నేరుగా ఎంపిక చేసిన కంపెనీల నుంచి యంత్రాలను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. 5 ఎకరాల్లోపు భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. మొత్తం 15 రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ జాబితాలో చేర్చారు.

ఈ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 16 కంపెనీలను ఎంపిక చేసింది. రైతులు ఆ కంపెనీల నుంచి యంత్రాలను కొనుగోలు చేస్తే, రైతు వాటాను మినహాయించి మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా ఆయా కంపెనీల అకౌంట్లలో జమ చేస్తుంది. పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రూ.లక్షకు మించి ధర కలిగిన యంత్రాలకు జియో ట్యాగింగ్ తప్పనిసరిగా అమలు చేయనున్నారు.

అలాగే చిన్న పరికరాలకు ఏఐ ఆధారిత టెలిమాటిక్స్ కిట్‌లను అమర్చనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా యంత్రాల వినియోగాన్ని పర్యవేక్షించి, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ యాంత్రీకరణను ఆధునిక సాంకేతికతతో ముడిపెట్టి రైతులకు మరింత మేలు చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పథకం అమలుతో తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానుందని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ALSO READ: న్యూ ఇయర్ ఎఫెక్ట్: కిలో మల్లెలు రూ.3,000.. ఎక్కడో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments