
American Airlines: వరుస విమాన సాంకేతిక లోపాలతో ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రయాణం తర్వాత చాలా మంది విమానాలు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఏ ఘటన జరిగినా ప్రయాణీకులు అహ్మదాబాద్ ఘటనతో పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా ఓ విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ లో మంటలు
తాజాగా అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బుధవారం ఉదయం 8.11 గంటలకు లాస్ వేగాస్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది. ఈ విమానం నార్త్ కరోలినాకు వెళ్లాల్సి ఉంది. విమానం పైకి ఎగిరిన కాసేపటి తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. గాలిలో ఉండగా, ఇంజిన్ నుంచి మంటలు, పొగలు రావడం మొదలు పెట్టాయి. వెంటనే ఈ విషయాన్ని పైలెట్ గమనించాడు. అప్రమత్తం అయ్యాడు. విమానాన్ని వెనక్కి తిప్పాడు. 8.20కి లాస్ వేగాస్ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానంలో 153 మంది ప్రయాణీకులు
ప్రమాద సమయంలో విమానంలో 153 మంది ప్రయాణీకులు ఉన్నారు. మరో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానయాన సంస్థ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించింది. మరో విమానంలో ప్రయాణీకులను తరలించినట్లు తెలిపింది.
Read Also: అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయి..రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు