రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యాంగం నడుస్తోంది
స్పీకర్ తీర్పు అర్థం లేనిది
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేదు, కాని ఇక్కడ కాంగ్రెస్ రాజ్యంగం నడుస్తుందని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై ఆయన స్పందించారు.
కాంగ్రెస్ ద్వంద్వ నీతికి స్పీకర్ తీర్పు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును కాలరాసి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్, కూతురుని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి, కండువా వేసుకుని తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని కోరిన కడియం శ్రీహరికి క్లీన్చిట్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేయడమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా గాలికి వదిలేశాడని నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నిధుల దోపిడీకి ఇక్కడ అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారు. అందుకే ఇక్కడి పరిణామాలపై, ఇక్కడి ప్రభుత్వ అరాచకాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నోరెత్తడం లేదని విమర్శించారు.
