జాతీయంలైఫ్ స్టైల్

ALERT: రీల్స్ అతిగా చూస్తున్నారా?

ALERT: ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్‌ జీవనశైలిలోకి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారింది.

ALERT: ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్‌ జీవనశైలిలోకి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి ప్లాట్‌ఫాంలలో రీల్స్‌, షార్ట్స్‌ చూడడం చాలామందికి టైంపాస్‌ మాత్రమే కాదు.. ఒక అలవాటుగా మారిపోయింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్‌ చేతిలోకి తీసుకుని రీల్స్‌ చూడడం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ అదే పనిగా స్క్రీన్‌లో మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కొందరైతే తినే సమయంలో, ప్రయాణాల్లో, కుటుంబంతో ఉన్నప్పటికీ రీల్స్‌ చూస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. ఈ అలవాటు నెమ్మదిగా వ్యసనంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రీల్స్‌, షార్ట్స్‌ వంటి చిన్న వీడియోలు మెదడును వేగంగా ఆకర్షించేలా రూపొందించబడుతాయి. ఒక్కటి చూసాక మరొకటి చూడాలనే ఆసక్తి కలిగించే విధంగా అవి మనసును బంధిస్తాయి. దీంతో సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అయితే ఈ అలవాటు వల్ల శరీరానికి, ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి స్క్రీన్‌ను చూడడం వల్ల కంటిపై అధిక ఒత్తిడి పడుతుంది. కనురెప్పలు సహజంగా కొట్టే సంఖ్య తగ్గిపోవడం వల్ల కళ్ళు పొడిబారడం, మంటలు, దురద వంటి సమస్యలు మొదలవుతాయి.

నిరంతరం స్క్రీన్‌ వైపు చూడటం వల్ల చూపు మందగించడం, కళ్ల నొప్పి, తలనొప్పి, మైగ్రేన్‌, నిద్రలేమి వంటి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రీల్స్‌ చూడటం వల్ల మొబైల్‌ నుంచి వెలువడే బ్లూ లైట్‌ నిద్రను ప్రభావితం చేస్తుంది. దీంతో నిద్ర సరైన విధంగా పట్టక మానసిక అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. ఈ డిజిటల్‌ ఒత్తిడిని నిపుణులు ఒక నిశ్శబ్దపు మహమ్మారిగా అభివర్ణిస్తున్నారు. బయటకు పెద్దగా కనిపించకపోయినా, లోపల నుంచి ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పిల్లల విషయంలో ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయసులోనే ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్‌ చూసే అలవాటు వల్ల వారి కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. కళ్ళు పొడిబారిపోవడం, హ్రస్వ దృష్టి పెరగడం, చిన్న వయసులోనే మెల్లకన్ను సమస్యలు రావడం వంటి ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒకసారి చూపు సమస్యలు మొదలైతే అవి జీవితాంతం వెంటాడే అవకాశం ఉండటంతో పిల్లలను సాధ్యమైనంతవరకూ మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. లేకపోతే దీర్ఘకాలికంగా శాశ్వత కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

రీల్స్‌ ఎక్కువగా చూడడం కేవలం కంటి ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికీ హానికరమే. ఎప్పుడూ ఫోన్‌లోనే మునిగిపోయే అలవాటు వల్ల మనసు అస్థిరంగా మారుతుంది. వాస్తవ జీవితంలో ఉన్న సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చే వీడియోలకు అలవాటు పడటం వల్ల దీర్ఘకాలికంగా ఏకాగ్రత తగ్గడం, సహనం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతాయి. ఇది చదువుపై, పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఈ అలవాటును ఒక్కసారిగా మానేయడం చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. అయితే నిదానంగా నియంత్రించుకోవడం మాత్రం చాలా అవసరం. రీల్స్‌ చూడటానికి రోజుకు ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకోవాలి. అవసరం లేని సమయంలో ఫోన్‌ను దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 20-20-20 రూల్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 సెకన్ల పాటు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లపై పడే ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది.

అదే విధంగా స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం, రాత్రివేళల్లో ఫోన్‌ వినియోగాన్ని తగ్గించడం, తరచూ కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంతో సమయం గడపడం, బయట నడకలు చేయడం, పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు పెంపొందించుకుంటే రీల్స్‌ మీద ఆధారపడే అలవాటు నెమ్మదిగా తగ్గుతుంది. డిజిటల్‌ ప్రపంచాన్ని పూర్తిగా దూరం చేయడం కష్టమే అయినా, దాన్ని మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి చేరనీయకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కంటి ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: Lifestyle: పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకునే రహస్యాలు.. భవిష్యత్తుకు పునాది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button