జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 2014లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు చేసే నాటికి ఆయన జాతీయ భద్రతా సలహాదారులగా బాధ్యతలు స్వీకరించలేదు. 2014లో ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
2014 మార్చి 11న ‘ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్’ అనే సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ‘ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశం మీద చర్చ జరిగింది. ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడారు. సుమారు గంటకు పైగా ఉన్న ఈ వీడియో అప్పట్లో అదే సంస్థ తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసింది. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదని, హిందువులు, ముస్లింలు అన్న కోణంలో కాకుండా.. దేశ సమస్యగా ఉగ్రవాదాన్ని చూడాలని దోవల్ చెప్పుకొచ్చారు. భారత్ లో నిఘా కార్యకలాపాల కోసం పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI నియమించుకుంటున్న భారతీయుల్లో ముస్లింలకంటే హిందువులే అత్యధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 1947 నుంచి ఉన్న 4 వేలకుపైగా కేసులను పరిశీలిస్తే వాటిల్లో 20 శాతం కేసులు కూడా ముస్లింలకు సంబంధించినవి లేవన్నారు. తాజాగాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
స్పందించిన అజిత్ దోవల్
అటు ఈ వ్యాఖ్యలపై అజిత్ దోవల్ స్పందించారు. తాను అలా మాట్లాడలేదని, అది డీప్ఫేక్ వీడియో వెల్లడించారు. అయితే, ఈ వీడియో ఫేక్ కాదని కొన్ని వెబ్ సైట్లు ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పాయి. ఇదే వీడియోలో భారతీయ ముస్లింలు ఉగ్రవాదాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నారని చెబుతూ.. 2012లో ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో 50వేల మంది మౌలానాలు సమావేశమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి పని ఏ హిందూ సంస్థ కూడా చేయలేదని దోవల్ వ్యాఖ్యానించినట్లు కొన్ని న్యూస్ ఏజెన్సీలు ప్రకటించాయి.





