
హైదరాబాద్, మే 23 (క్రైమ్ మిర్రర్): హైదరాబాద్లో అవినీతి మరోసారి వెలుగు చూసింది. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేట్ నిర్మాణదారుడు దాఖలు చేసిన బిల్డింగ్ మార్ట్ గేజ్ NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) మంజూరు చేయడానికి విట్టాల్ రావు మొత్తం రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
మొదట విడతలో రూ.4 లక్షలు తీసుకున్న విట్టాల్ రావు, మిగిలిన మొత్తం చెల్లించిన తర్వాతే ఫైళ్లను ముందుకు తరలిస్తానని బాధితుడికి స్పష్టంగా తెలిపాడని సమాచారం.
ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేసిన ఫిర్యాదుదారు వెంకట్ రావు, ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల వ్యూహాత్మక పద్ధతిలో లైవ్ ట్రాప్ ఏర్పాటు చేసి, విట్టాల్ రావును లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మూడు ప్రదేశాల్లో ఏకకాల దాడులు : ఈ వ్యవహారంలో విట్టాల్ రావు కార్యాలయం, నివాసంతో పాటు సంబంధిత ఇతర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మూడు చోట్ల దాడులు నిర్వహించారు. దర్యాప్తును ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో చేపట్టారు. విట్టాల్ రావు ఆదాయం, అతని పేరు మీద ఉన్న ఆస్తులు, సంబంధిత లావాదేవీలు అన్నింటిపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.