క్రైమ్ మిర్రర్ తెలంగాణా ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: ప్రేమ వ్యవహారం నేపథ్యంలో మరో యువకుడు బలయ్యాడు. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో బీటెక్ స్టూడెంట్ ను అమ్మాయి తల్లిదండ్రులు అత్యంత దారుణంగా హత్య చేసిన దారుణమైన ఘటన కలకలం రేపుతోంది.
పెళ్లి గురించి మాట్లాడుకుందాం రా అని ఇంటికి పిలిపించుకుని హత్య చేయడంపై యువకుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ సృజన లక్ష్మీ నగర్లో వెలుగుచూసింది. ఈ సంఘటన అమీన్పూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు మరియు విషాదానికి దారితీసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి…
జ్యోతి శ్రవణ్ సాయి అలియాస్ శివ(20) స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు. అయితే ప్రస్తుతం అతడు కుత్బుల్లాపూర్ లో అద్దె రూమ్ లో నివాసం ఉంటున్నాడు. మైసమ్మ గూడలో సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు.
అయితే సంగారెడ్డి జిల్లా బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసిందే. దాంతో పలుమార్లు సాయిని హెచ్చరించారు. కానీ వీరి ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగింది.
ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ సంబంధానికి యువతి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.పెళ్లి గురించి మాట్లాడదామని నమ్మించి శ్రీజ తల్లిదండ్రులు, బంధువులు శ్రవణ్ సాయిని తమ ఇంటికి పిలిపించారు.
అతను వచ్చిన తర్వాత, క్రికెట్ బ్యాట్ మరియు కత్తెర వంటి వాటితో అతనిపై దారుణంగా దాడి చేశారు, దీనివల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శ్రవణ్ సాయిని కుటుంబ సభ్యులే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
ఇది పరువు హత్య (Honour Killing) గా పోలీసులు భావిస్తున్నారు. శ్రవణ్ సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.





