ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ నుంచి ఊరటనిచ్చే శుభవార్త అందింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు వేస్తూ కొత్త రైల్వే మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. పీఎం గతిశక్తి పథకం కింద ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించింది. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్ట్ నుంచి తెట్టు రైల్వే స్టేషన్ వరకు సుమారు 5.5 కిలోమీటర్ల పొడవుతో ఈ కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పోర్ట్కు నేరుగా రైల్వే అనుసంధానం కలగడం వల్ల సరుకు రవాణా మరింత సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించగా, రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.
ఈ కొత్త రైల్వే మార్గం పీఎం గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ పథకం పరిధిలో అమలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ నిర్మాణ పనులను చేపట్టనుందని వెల్లడించారు. విజయవాడ-గూడూరు ప్రధాన రైల్వే మార్గంపై ఉన్న తెట్టు రైల్వే స్టేషన్కు ఈ కొత్త లైన్ అనుసంధానమవుతుండటంతో పోర్ట్కు సరుకు రవాణా వేగం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి లాజిస్టిక్స్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
ALSO READ: ఏపీకి రిలీఫ్.. వచ్చే 3 రోజులు వానలు
