అంతర్జాతీయం

భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలు.. 38 మంది మృతి

Pakistan Floods 2025: రుతుపవనాల ప్రభావంతో పాకిస్తాన్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 38 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 68 మంది గాయపడినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి   

అటు శుక్రవారం నాడు  స్వాత్‌ లో వరదల్లో కొట్టుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కళ్లముందే ఒక్కొక్కరుగా 18 మంది వరదలో కొట్టుకుపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను చూసి అందరూ కంటతడి పెట్టారు.

పర్యటన కోసం వచ్చి.. ప్రాణాలు కోల్పోయి..

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో స్వాత్ నది పరిసరాలు చూసేందుకు ఓ కుటుంబం వచ్చింది. అందులో భాగంగానే నది మధ్యలోకి వెళ్లారు. ఆ సమయంలో ఎలాంటి వరద ప్రవాహం లేదు. కాసేపటి తర్వాత పై ప్రాంతం నుంచి ఊహించని రీతిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో వారు బయటకు రాలేకపోయారు. ఓ మట్టిగడ్డ మీద నిలబడ్డారు. వరద ప్రభావం పెరగడంతో ఒక్కొక్కరుగా వరదలో కొట్టుకుపోయారు. మొత్తం 18 మంది చనిపోగా, 9 మంది మృతదేహాలు వెలికితీశారు. మిగతా మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది.  అటు స్వాత్ నది పరిసర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

విపక్షాల విమర్శలు

వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నా, జనాలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని కాపడ్డంలో పాక్ ప్రభుత్వం విఫలం అయ్యిందని  తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ నాయకులు విమర్శలు చేశారు.

Read Also: ముగ్గురు పిల్లల్ని కనండి.. మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button