పెళ్లి తర్వాత కొంత కాలానికి విడాకులు తీసుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ, ఓ పెళ్లి కూతురు పైళ్లైన కొద్ది గంటల్లోనే షాక్ ఇచ్చింది. అత్తింటికి వచ్చిన 20 నిమిషాల్లోనే భర్తతో విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
ఇదీ అసలు కథ!
డియోరియాకు చెందిన విశాల్ మాధేసియాకు అదే ప్రాంతానికి చెందిన పూజకు నవంబర్ 25న పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన రోజు రాత్రి కొత్త పెళ్లి కూతురు పూజ అత్తింటికి వచ్చింది. అత్తింటికి వచ్చిన 20 నిమిషాల పాటు బాగానే ఉంది. ఆ తర్వాత బంధువులందరి ముందుకు వచ్చి మా అమ్మానాన్నను పిలవండి. నేను ఇక్కడ ఉండలేను అని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె ప్రాంక్ చేస్తుందేమోనని అనుకున్నారు. ఆమె పదే పదే అదే మాట అనటంతో నమ్మక తప్పలేదు. వెంటనే ఆమె తల్లిదండ్రుల్ని పిలిపించారు.
తల్లిదండ్రుల మీద బెంగతోనేనా?
అత్తింట్లో ఉండలేనని తల్లిదండ్రులతో పూజ తేల్చి చెప్పింది. వారు ఎంత బ్రతిమాలినా కూడా ఆమె వినలేదు. విడాకులు కావాలని పట్టుబట్టింది. కారణం అడిగినా ఏమీ చెప్పలేదు. ఈ వివాదంపై మరుసటి రోజు గ్రామ పంచాయతీ జరిగింది. రెండు కుటుంబాల అంగీకారంతో భార్యాభర్తలు విడిపోయారు. వధువు కుటుంబం ఇచ్చిన కానుకల్ని వరుడి కుటుంబం తిరిగి ఇచ్చేసింది. కొద్దిసేపటి తర్వాత పూజ కుటుంబం అక్కడినుంచి వెళ్లిపోయింది.
UP Deoria: Bride Pooja spent just 20 mins at in-laws' house, refused to stay, demanded divorce. After 5-hr talks, groom Vishal signed divorce papers same night instead of suhaagraat. pic.twitter.com/Kg73Xqie7C
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 1, 2025
పెళ్లి కొడుకు ఏమన్నాడంటే?
అటు ఈ సంఘటనపై విశాల్ రియాక్ట్ అయ్యాడు. తనంటే ఇష్టం లేదని పూజ పెళ్లికి ముందు ఎప్పుడూ చేప్పలేదన్నాడు. పెళ్లి కాకముందు ఎంతో చక్కగా మాట్లాడిందన్నాడు. ఆమె చేసిన పని కారణంగా రెండు కుటుంబాలు అవమానాల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన యూపీలో హాట్ టాపిక్ గా మారింది. పేరెంట్స్ మీద బెంగతోనే ఇలా చేసి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.





