
మునుగోడు, క్రైమ్ మిర్రర్: మునుగోడు మండలంలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులపై ఇంచార్జీ ఎంపిడిఓ విజయభాస్కర్ వేధింపులు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగురి నరసింహ, రైతుసంఘం జిల్లా కార్యదర్శి గురజ రామచంద్రం తీవ్రంగా డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ – గ్రామాభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కార్యదర్శులను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వారిని గ్రేడ్ ల వారీగా విభజించి ఇతర మండలాలకు బదిలీ చేయాలని ప్రయత్నించటం దారుణమని విమర్శించారు.
చిన్న ఉద్యోగులను వేధించడం బాధాకరమని, పై స్థాయి అధికారులకు చేస్తున్న సిఫార్సులు అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే ఈ వివక్షను ఆపాలని, ఎలాంటి వేధింపులు లేకుండా ఉద్యోగులు పనిచేసేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో మండల కార్యదర్శులు చాపల శ్రీను, గోస్కొండ లింగయ్య, ఉప్పు నూతల రమేష్, దుబ్బ వెంకన్న, ఎండి జానీ, కురుమూర్తి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.