
గుజరాత్లోని సూరత్ నగరంలో చోటుచేసుకున్న ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త చేతుల్లో నిత్యం శారీరక, లైంగిక వేధింపులకు గురయ్యానంటూ 37 ఏళ్ల మహిళ తన భర్తనే హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా వేధింపులు భరించలేకపోయానని, ఆ మానసిక క్షోభే ఈ నేరానికి దారి తీసిందని నిందితురాలు పోలీసుల విచారణలో అంగీకరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతులు బీహార్కు చెందినవారు కాగా, సూరత్లోని లింబాయత్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మృతుడు ముంబైలో కూలీగా పనిచేస్తూ నెలకు ఒకసారి మాత్రమే సూరత్లోని ఇంటికి వచ్చేవాడు. అయితే, ఇంటికి వచ్చిన ప్రతిసారి భార్యపై శారీరకంగా, లైంగికంగా హింసకు పాల్పడేవాడని నిందితురాలు ఆరోపించింది. అతడు లైంగిక ప్రేరేపణ మాత్రలు తీసుకునేవాడని, దాడుల కారణంగా తాను తీవ్ర గాయాలు, రక్తస్రావం వరకు ఎదుర్కొన్నానని విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో, జనవరి 1వ తేదీ రాత్రి భర్తకు రహస్యంగా పసుపు పాలలో ఎలుకల మందు కలిపి ఇచ్చినట్టు నిందితురాలు ఒప్పుకున్నట్టు ఇన్స్పెక్టర్ ఎన్కె కమాలియా తెలిపారు. అయితే ఆ సమయంలో అతను మరణించలేదు. దీంతో జనవరి 5న మరోసారి దాడికి పాల్పడి, గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తీవ్ర గాయాలపాలైన భర్తను సూరత్లోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు.
ప్రారంభంలో భర్త అనారోగ్య కారణంగా చనిపోయాడని మహిళ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే, అంత్యక్రియల విషయంలో మృతుడి సోదరుడితో నిందితురాలికి వివాదం తలెత్తడంతో అనుమానాలు మొదలయ్యాయి. మృతదేహాన్ని బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు తీసుకెళ్లి ఖననం చేయాలని సోదరుడు కోరగా, సూరత్లోనే అంత్యక్రియలు చేయాలని భార్య పట్టుబట్టడం అనుమానాలకు దారి తీసింది. ఈ వాగ్వాదం, నిందితురాలి ప్రవర్తనపై అనుమానం కలగడంతో మృతుడి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహానికి ఫోరెన్సిక్ పోస్ట్మార్టం నిర్వహించారు. నివేదికలో విషప్రయోగం జరిగినట్టు, అలాగే గొంతు కోసిన గాయాలు, మెడ, ఛాతీపై ఒత్తిడి గాయాలు ఉన్నట్టు తేలింది. ఈ ఆధారాలపై పోలీసులు జనవరి 25న ఆ మహిళను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తుండగా, కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ALSO READ: ఇంతకన్నా దారుణం ఇంకేమీ ఉండదేమో.. బాలికపై తండ్రి, మేనమామ అత్యాచారం





