Aadhaar PVC Card Charges: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) దేశ ప్రజలకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ పీవీసీ కార్డు రేటును పెంచేసింది. ఆధార్ పీవీసీ కార్డుకు ప్రస్తుతం రూ. 50 తీసుకుంటుండగా, దానిని రూ.75 వరకు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన రేట్లు వెంటనే అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. అయితే, ఈ పెంచిన రేట్లలో జీఎస్టీ, డెలివరీ ఛార్జీలు కూడా కలిపే ఉంటాయని స్పష్టం చేసింది.
ఈజీగా క్యారీ చేసేలా పీవీసీ కార్డు రూపంలో..
ఆధార్ కార్డును మొదట్లో ఒక పేపర్ మాదిరిగా ఇచ్చేవారు. దానికి ల్యామినేషన్ చేసేవారు. ఆ తరువాత ఆధార్ మరింత స్ట్రాంగ్గా, నాణ్యమైనదిగా ఉండేందుకు పీవీసీగా మార్చారు. పీవీసీ కార్డు అయితే ఎవరైనా సరే సులభంగా తమ వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరూ పీవీసీ కార్డు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
తొలిసారి పీవీసీ కార్డుల ధరల పెంపు
UIDAI 2020లో పీవీసీ కార్డులను తీసుకొచ్చింది. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఛార్జీలను పెంచారు. ఆధార్ పీవీసీ కార్డ్ ఉత్పత్తి కోసం ఉపయోగించే మెటీరియల్, ముద్రణా ఖర్చులు, భద్రతా పంపిణీ, లాజిస్టిక్స్ వంటి కార్యకలాపాలకు సంబంధించిన వ్యయాలు భారీగా పెరిగాయని.. దీని కారణంగా రేట్లు పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వినియోగదారులు myAadhaar వెబ్సైట్, mAadhaar మొబైల్ యాప్ ద్వారా PVC కార్డ్ కోసం ఆర్డర్ చేయొచ్చని తెలిపారు.





