
Viral video: రైల్లో కుటుంబాలతో కలిసి ప్రయాణించడం అంటే ప్రత్యేకమైన ఆనందం. ముందుగా ఇంట్లోనే పులిహోర, దద్దోజనం, పూరీలు, చికెన్ వంటకాలు, స్వీట్ పూరీలు, చపాతీలు, బిర్యానీ, టీ-కాఫీ ఇలా ఎన్నో రకాలుగా సిద్ధం చేసుకుని బోగీలో కూర్చొని తినే ఆ అనుభూతి మరొకటి ఉండదు. పిల్లలు కూడా ఈ టూర్లలో ఆనందంగా తింటూ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చేస్తారు. ఇలాంటి జ్ఞాపకాలు చాలా మందికి జీవితాంతం మధురానుభూతులుగానే నిలుస్తాయి. కొందరు మాత్రం వేడి వేడి ఫుడ్కే అలవాటు పడటంతో రైల్వే క్యాంటీన్ నుంచో, రైలు ఆగే స్టేషన్లలోనో తినటానికి ఇష్టపడతారు.
అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ చేసిన పని మాత్రం చూసిన వారిని ఆశ్చర్యంలో ముంచేసింది. ఆమే ఏసీ బోగీలోనే తాను తెచ్చుకున్న ఎలక్ట్రిక్ కెటిల్ను రైలు చార్జింగ్ సాకెట్కు జోడించి, అందులో ఇన్స్టంట్ మ్యాగీ నూడుల్స్ వండి తినడం మొదలుపెట్టింది. అంతే కాకుండా కెమెరాకు పోజులిస్తూ ఈ మొత్తం ప్రక్రియను వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్ అవ్వడంతో ప్రయాణ భద్రతపై ప్రశ్నలు లేవడం మొదలైంది.
This is a major safety hazard and can cause fire endangering lives of all onboard. That's why we cannot have good things. Many will misuse the facilities and then be proud of it. Most lack civil sense. pic.twitter.com/JSRCpIXPW9
— Backpacking Daku (@outofofficedaku) November 20, 2025
రైలులో ఇలా అనుమతించని ఎలక్ట్రిక్ పరికరాలు వాడటం వల్ల బోగీలోని ఎలక్ట్రికల్ సర్క్యూట్పై అదనపు భారంపడి, షార్ట్సర్క్యూట్ లేదా అగ్నిప్రమాదానికి దారితీయొచ్చని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదా? ఇలాంటి పని చేస్తే ప్రమాదం తప్పదు” అంటూ చాలామంది అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు ఎలక్ట్రిక్ కెటిల్స్ వాడటం పూర్తిగా నిషేధమని గుర్తుచేశారు.
ఒక యూజర్ తన అనుభవాన్ని షేర్ చేస్తూ, “ఏళ్ల క్రితం మా ప్రయాణంలో ఒక కుటుంబం బోగీలోనే అగర్బత్తి, కర్పూరం వెలిగించి పూజ చేసింది. వెంటనే టీసీకి ఫిర్యాదు చేశాం. ఇప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు ఆగట్లేదు” అని వ్యాఖ్యానించారు. టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యల్ని ఎవరూ చేయకూడదని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. రైల్లో ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చిన్న తప్పిదంతోనే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని వారందరూ హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Rare surgery: తోకతో జన్మించిన చిన్నారి.. శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పించిన వైద్యులు





