UPSC: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025కు సంబంధించిన ఫైనల్ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించగా దేశవ్యాప్తంగా అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఫలితాల ప్రకారం మొత్తం 958 మంది అభ్యర్థులు అఖిల భారత సివిల్ సర్వీసుల్లో ఎంపికయ్యారు. గత ఏడాది ఆగస్ట్ నెలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మూడు దశల పరీక్షల అనంతరం తుది జాబితాను కమిషన్ విడుదల చేసింది.
ఈసారి విడుదలైన ఫలితాల్లో అనుజ్ అగ్నిహోత్రి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకును సాధించి ప్రతిభ కనబర్చారు. రెండో ర్యాంకును రాజేశ్వరి సువే సాధించగా, మూడో ర్యాంకును ఆకాన్ష్ ధుల్ కైవసం చేసుకున్నారు. మొత్తం 1087 ఖాళీలకు ఈ నియామక ప్రక్రియ జరుగుతుండగా, అందులో 42 స్థానాలను ప్రత్యేక అవసరాలు ఉన్న అభ్యర్థుల వర్గానికి కేటాయించారు. తుది జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ వంటి ప్రతిష్టాత్మక సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ గ్రూప్ ఎ మరియు గ్రూప్ బి సేవల్లో నియామకాలు కల్పిస్తారు.
ప్రతి సంవత్సరం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు. ఈ పరీక్షల ఎంపిక ప్రక్రియ అత్యంత కఠినంగా ఉండటంతో పాటు మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని మెయిన్స్ పరీక్షలకు అనుమతిస్తారు. అనంతరం మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ మూడు దశలలో ప్రతిభ చూపిన వారినే తుది జాబితాలో ఎంపిక చేస్తారు. ఈ విధంగా కఠినమైన వడపోత తర్వాత ఎంపికైన అభ్యర్థులు దేశ పరిపాలనలో కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని పొందుతారు.
ALSO READ: ఈ ఉగాది నుంచి రెండు రాశుల వారికి గుడ్ టైం స్టార్ట్!
