
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026-27పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన ఆయన.. ఈ బడ్జెట్ పూర్తిగా దేశ హితం, ప్రజల సంక్షేమం, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా దేశాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకే ఈసారి బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశాల్లో కేంద్రం సానుకూలంగా స్పందించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు ఎంతో కీలకమైన మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో మెట్రో కీలక పాత్ర పోషిస్తుందని, రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే నగరానికి ప్రాణవాయువులాంటి మూసీ నది ప్రక్షాళనకు కూడా కేంద్రం నిధులు కేటాయించబోతోందని చెప్పారు. మూసీ శుద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు.
దేశవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆర్థిక రంగం నుంచి సామాజిక రంగం వరకు, పాలనలో పారదర్శకత నుంచి జాతీయ భద్రత వరకు విస్తృత మార్పులు జరిగాయని తెలిపారు. ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కూడా అదే దిశలో సాగుతుందని, రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి, పేద వర్గాలు ఇలా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో జరుగుతున్న సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ తప్పకుండా సహకరించాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో చట్టానికి అందరూ సమానమేనని, విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఈసారి బడ్జెట్ ప్రసంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా, ఈసారి ఆమె ప్రసంగంలో పార్ట్ ఏ కంటే పార్ట్ బిపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. అంటే విధాన ప్రకటనల కంటే అమలు, ఖర్చుల కేటాయింపులు, ఆర్థిక ప్రణాళికలపైనే ఎక్కువ ఫోకస్ ఉండబోతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ALSO READ: Cardamom: భోజనం తర్వాత వీటిని తింటే బోలెడు ప్రయోజనాలు





