
-
మోసగాళ్లను నమ్మొద్దన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడు
-
టికెట్లు ఇప్పిస్తామని భక్తులను దగా చేస్తున్నారని మండిపాటు
-
ప్రజాప్రతినిధుల పేరు చెప్పి దండుకుంటున్నారని వెల్లడి
-
పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం
-
భక్తులెవరూ మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచన
క్రైమ్మిర్రర్, అమరావతి: తిరుమలలో భక్తులను దళారులు మోసం చేస్తున్న వైనంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. వీఐపీ బ్రేక్ దర్శనలు, ఆర్జిత సేవలు, ఇతర డిమాండ్ ఉన్న టికెట్లు ఇస్తామని అమాయక భక్తుల నుంచి మోసగాళ్లు పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల పేషీల్లో, టీటీడీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిగా చెప్పుకుంటూ భక్తులకు పరిచయమవుతున్నారని, వారికి టికెట్లు ఇప్పిస్తామని నమ్మ బలికి మోసాలకు పాల్పడుతున్నారని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇలాంటి వారిని నమ్మి భక్తులు మోసపోయిన ఘటనలు అనేకం తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. భక్తులెవరూ మోసగాళ్ల మాయలో పడొద్దని ఆయన సూచించారు. దళారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు టీటీడీ చైర్మన్. దర్శనం టికెట్లు, వసతి గదుల కోసం టీటీడీ అధికార వెబ్సైట్నే ఆశ్రయించాలని టీటీడీ చైర్మన్ నాయుడు సూచించారు.
ఇవీ చదవండి