
Tragedy at Koraput Hospital: వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండకపోతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహారణ. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒడిషాలో జరిగింది. కోరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్సపొందుతున్న ఐదుగురు పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. అర్థరాత్రి సమయంలో నర్సు కన్ఫ్యూజ్ అయి వేరే ఇంజెక్షన్ ఇవ్వడంతో ఈ ఘోరం జరిగింది.
ఇంజెక్షన్ వేసిన కొద్ది నిమిషాల్లోనే పేషెంట్లు మృతి
నైట్ డ్యూటీలో ఉన్న ఓ నర్సు అర్థరాత్రి సమయంలో ఐదుగురు పేషెంట్లకు రెండో రౌండ్ ఇంజెక్షన్ వేసింది. కాసేపట్లోనే రోగులు నొప్పితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు, మృతుల బంధువులు వెల్లడించారు. “అర్థరాత్రి సమయంలో వచ్చిన ఓ నర్సు ఐదుగురు పేషెంట్లకు ఇంజెక్షన్ ఇచ్చింది. మా సిస్టర్ కు కూడా అదే ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆమె నొప్పితో తీవ్ర ఇబ్బంది పడింది. నొప్పి తట్టుకోలేక అల్లాడిపోయింది. డాక్టర్ వచ్చే లోగా మా సోదరితో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు పోయాయి” అని మృతురాలి బంధువు కన్నీరు మున్నీరుగా విలపించింది.
Read Also: ఇన్ స్టాలో పంచాయితీ, బయట హత్యాయత్నం!
హాస్పిటల్ దగ్గర భద్రత పెంపు
చనిపోయిన ఐదుగురు పేషెంట్లు ఈ హాస్పిటల్ లోనే రకరకాల ఆపరేషన్లు చేయించుకున్నట్లు వారి బంధువులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలిపారు. నర్సు ఇంజెక్షన్ వేయడంతో వారి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. పేషెంట్ల చావుకు కారణమైన నర్సుతో పాటు ఇతర ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు హాస్పిటల్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై హాస్పిటల్ సిబ్బంది ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పోస్టుమార్టం తర్వాత మృతికి గల కారణాలను వివరించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: వాళ్లు హాస్పిటల్లోకి అడుగు పెట్టొద్దు, కేంద్రం సంచలన నిర్ణయం!