Rains In AP: నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నెల 22 నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అటు రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో కోస్తా తీర జిల్లాల్లో దాదాపు వారం రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి.
కోస్తా జిల్లాల్లో తీవ్ర ప్రభావం
అల్ప పీడనం ప్రభావంతో సముద్రంలో గాలుల వేగం పెరగడంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటను నిలిపివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. డెల్టా, కోస్తా జిల్లాల్లో మళ్లీ ఆదివారం నుండి వర్షాలు కురవబోతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో వచ్చే శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
తమిళనాడులోనూ వర్షాలు
అటు ఈ అప్పపీడనం ప్రభావంతో తమిళనాడులోని చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, మైలాడుదురై, నాగపగట్నం, తిరువారూర్, కడలూరు, విల్లుపురం, తంజావూరు, పుదుకోట, తిరునల్వేలి, కన్నియాకుమారి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మైలాడుదురై, తిరువారూర్, నాగపట్నం జిల్లాల నుండి సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత మూడు రోజులుగా చేపల వేటపై ఆంక్షలు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతాల జాలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.





