ఏలూరు జిల్లాలోని నరసాపురానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ తన అద్భుత ప్రతిభతో మరోసారి ప్రజలను ఆకట్టుకున్నారు. పెన్సిల్ మొనపై అతి చిన్న పరిమాణంలో కళాఖండాలను చెక్కే అరుదైన నైపుణ్యంతో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు పొందిన ఆయన.. శివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుని ప్రతిమను పెన్సిల్ లీడ్ పై చెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సాధారణంగా ఇలాంటి సూక్ష్మ కళా రూపాలను రూపొందించడానికి ప్రత్యేక పరికరాలు అవసరమవుతాయి. అయితే ఎటువంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా కేవలం గంటన్నర వ్యవధిలో ఈ ప్రతిమను పూర్తి చేసినట్లు విజయ్ మోహన్ తెలిపారు. ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించిన స్థానికులు, కళాభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సూక్ష్మ కళలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విజయ్ మోహన్ గతంలో కూడా ఎన్నో అరుదైన కృతులను సృష్టించారు. 2021 సంవత్సరంలో పెన్సిల్ లీడ్ పై 246 లింకులతో గొలుసును రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. అతి సూక్ష్మ పరిమాణంలో అంత సమగ్రంగా గొలుసును చెక్కడం కళా ప్రపంచంలో విశేషంగా నిలిచింది. అదే విధంగా 2019 సంవత్సరంలో అంగుళం ఎత్తుతో జ్యూస్ తయారు చేసే యంత్రం, మజ్జిగ చిలికే యంత్రం నమూనాలను రూపొందించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. చిన్న పరిమాణంలోనూ స్పష్టమైన ఆకృతులు ఇవ్వడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
2018 సంవత్సరంలో 3 బియ్యపు గింజలపై జాతీయ గీతాన్ని తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో చెక్కి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. మొత్తం 9 గంటల వ్యవధిలో ఎటువంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా ఈ కృతిని పూర్తి చేయడం విశేషం. సూక్ష్మ కళలో అత్యున్నత స్థాయి కృషికి గుర్తింపుగా అదే సంవత్సరంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రీయ యువ గౌరవ అవార్డు అందుకున్నారు. ఇది ఆయన కళా ప్రయాణంలో మరొక మైలురాయిగా నిలిచింది.
ఇప్పటివరకు 30కి పైగా అవార్డులు, రికార్డులు సాధించిన విజయ్ మోహన్ 200కు పైగా కళాఖండాలను రూపొందించారు. సూక్ష్మ కళను సామాన్య ప్రజలకు చేరువ చేయడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. పెన్సిల్ మొనపై ప్రపంచాన్ని ఆవిష్కరించే ఈ యువ కళాకారుడు భవిష్యత్తులో మరిన్ని అరుదైన కృతులతో దేశానికి గర్వకారణంగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ALSO READ: DSC: మళ్లీ కొలువుల జాతర షురూ.. ఉగాదికి నోటిఫికేషన్
