
-
సీఎం టీం వర్సెస్ ఎమ్మెల్యే టీం
-
ముఖ్యమంత్రిని లెక్కచేయని మర్రిగూడ కాంగ్రెస్ లీడర్స్
-
యరగండ్లపల్లిలో రేవంత్ ఫొటో లేకుండా హస్తం నేతల ఫ్లెక్సీ
-
కోమటిరెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురి విమర్శలు
-
మంత్రి పదవి విషయంలో సీఎంపై రాజగోపాల్ గుర్రు!
-
గతంలో రేవంత్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా మండల కాంగ్రెస్ నాయకులు
-
రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసిన ఫ్లెక్సీ వ్యవహారం
క్రైమ్మిర్రర్, నల్గొండ: మునుగోడులో హస్తం పార్టీ రాజకీయాలు రోజు రోజుకూ కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాజగోపాల్ కి మంత్రి పదవి రాకపోవడానికి కారణం సీఎమ్మే అని మునుగోడు కాంగ్రెస్ శ్రేణుల్లో బాగా నాటుకుపోయింది. రాజగోపాల్ రెడ్డి ప్రతి వేదికలోనూ తనకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ వస్తున్నారు. స్థానిక కార్యకర్తలు కూడా అదే రీతిలో సీఎం పట్ల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నారు.
ఈ విభేదాలు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలో జరిగిన బోనాల సందర్భంగా వెలిసిన ఫ్లెక్సీలతో మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ అగ్రనేతలు, మంత్రులు, స్థానిక నాయకుల ఫొటోలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో మాత్రం లేదు. దీంతో ప్రోటోకాల్ను తుంగలో తొక్కారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనూ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు మండల కాంగ్రెస్ దూరంగా ఉండటం గమనార్హం. ఇప్పుడు ఫ్లెక్సీలలో సీఎం ఫొటో లేకపోవడం, కోమటిరెడ్డి వర్గం కావాలనే ఈ మార్గాన్ని ఎంచుకుందా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మునుగోడులో ఈ పరిణామం ‘సీఎం టీం వర్సెస్ ఎమ్మెల్యే టీం’ అన్న వాతావరణాన్ని సృష్టించింది. రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.
Read Also: