-
తన పొలం సర్వేకు నోటీసులపై మండిపడ్డ అంబటి
గుంటూరు,క్రైమ్మిర్రర్: కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై చేసిన దాడిని ప్రజలు దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్ప్పుకొచ్చారు. తన ఆస్తులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనకు సత్తెనపల్లిలో 22 ఎకరాల పొలం ఉందని ఆ పొలానికి కూడా సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారని ప్రస్తావించారు.
బుధవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పొలాన్ని సర్వే చేయాలని ఎమ్మార్వో కార్యాలయం నుంచి తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ తనిఖీ చేయమని చెప్పారని వారు తనకు చెప్పారన్నారు. తన పొలంలో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ ఉందని.. సర్వే చేయాలని అధికారులు చెబుతున్నారని అన్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లకు పని ఏమి లేదా అని ప్రశ్నించారు. వారు తన ఆస్తుల మీద పడ్డారని… తాను లీగల్గా కొనుకున్న స్థలం అదని చెప్ప్పుకొచ్చారు. తాను వేరే వారి నుంచి పొలం కొనుక్కునే ముందే అందులో చిన్న బావి, పెంకుటిల్లు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదన్నారు. తన దగ్గర దాపరికాలు ఏమి ఉండవుని చంద్రబాబు, లోకేశ్ తన పొలం చూస్తాను అంటే రావాలని అన్నారు. తనను బయపెట్టాలని వారు అనుకుంటున్నారని తెలిపారు. రేపు గుంటూరులో తమ ఇంటికి కూడా నోటీసులు ఇస్తారేమోనని ఆయన పేర్కొన్నారు.
