
Gali Janardhan Reddy Case: ఓబులాపురం మైనింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది. గాలి జనార్దన్రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లతోపాటు గాలి జనార్దన్రెడ్డి విడిగా దాఖలు చేసిన జైలుశిక్ష సస్పెన్షన్ పిటిషన్లపై తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 లక్షల పూచికత్తు ఇవ్వడంతో పాటు దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు సూచించింది.
జైలుశిక్ష సస్పెన్షన్ పిటిషన్ పై కీలక వాదనలు
జైలుశిక్ష సస్పెన్షన్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. జనార్దన్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు నళిన్ కుమార్, నాగముత్తు వాదించారు. పిటిషనర్ ఇప్పటికే సగానికిపైగా జైలు శిక్ష అనుభవించారని వెల్లడించారు. ఇంకా మూడున్నరేళ్ల జైలు శిక్ష మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ దశలో శాసన సభ్యత్వం కోల్పోకుండా సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని హైకోర్టును విజ్ఞప్తి చేశారు. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి గత నెలలో నోటిఫికేషన్ జారీ చేశారని కోర్టుకు తెలిపారు. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోలుకోలేని పార్టీతో పాటు గాలి జనార్థన్ రెడ్డి నష్టం కలుగుతుందన్నారు. జైలు శిక్ష రద్దుకు సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం తాజాగా కీలక తీర్పు వెల్లడించింది. నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన 7 ఏళ్ల శిక్షను రద్దు చేసింది.
మే 6న ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు
అటు 15 ఏళ్ల పాటు కొనసాగిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మే 6న నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితులు వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, డి.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ కు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్ కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా తీర్పు ఊరట కలిగించింది.
Read Also: ఉగ్రవాదంతో రెచ్చగొడితే.. సర్వనాశనం చేస్తాం!