
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సెషన్ మొత్తం స్పీకర్ సస్పెండ్ చేశారు. సభలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇవాళ మూడు కీలక బిల్లులు తెలంగాణ శాసనసభ ముందుకు రానున్నాయి.ఎస్సీల వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు.
బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన అనంతరం.. దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు.
శాసనసభ, శాసనమండలి ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నాయి. విదేశీ విద్యానిధి పథకంతో పాటు ప్రభుత్వ జీవోలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీల పెంపు, హెచ్ఎండీఏ భూముల తాకట్టు తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఇక మండలిలో కూడా కీలక ప్రశ్నలు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు, సీతారామ ప్రాజెక్టు, ఫార్మాసిటీ తదితర అంశాలపై ప్రశ్నలకు ప్రభుత్వం జవాబివ్వనుంది.
చరిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు. మంత్రి చాంబర్లో వారి కోసం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.