
మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారా… ఎంత అడిగినా ఇవ్వడం లేదా.. అతనితో తాడోపేడో తేల్చకుందామనుకుంటున్నారా… బెదిరించైనా డబ్బులు వసూల్ చేయాలనుకుంటున్నారా… అయితే మీకూ హెచ్చరిక. మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తిని బెదిరించకండి… అలా చేస్తే మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అవును మీరు చదివింది నిజమే. బలవంతంగా అప్పు వసూల్ చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఇందుకు సంబంధించిన చట్టం చేసింది తమిళనాడు ప్రభుత్వం.
బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష పడేలా కొత్తగా రూపొందించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది తమిళనాడు ప్రభుత్వం. శాసనసభ ఆమోదించిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదించారు. ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపింది తమిళనాడు ప్రభుత్వం.
ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వం. రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది.