Gurmeet Ram Rahum Singh Parole: ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష పడిన డేరా సచ్ఛా సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు మరోసారి హర్యానా ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ఈసారి కూడా ఆయనకు 40 రోజుల పెరోల్ ఇచ్చింది. హర్యానాలోని రోహ్తక్ లో సునరయి జైలులో ప్రస్తుతం ఆయన శిక్ష అనుభవిస్తున్నారు.
జైలు నుంచి బయటకు రావడం ఇది 15వ సారి
డేరాబాబా 2017 ఆగస్టులో దోషిగా నిరూపణ అయినప్పటి నుంచి పెరోల్పై జైలు బయటకు రావడం ఇది 15వ సారి. గత ఏడాది ఆగస్టులో కూడా ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరైంది. పదహారేళ్ల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులోనూ డేరాబాబా, మరో ముగ్గురిని కోర్టు దోషులుగా తీర్పుచెప్పింది. కాగా, గత జనవరిలో 30 రోజులు, ఏప్రిల్లో 21 రోజులు ఆయన పెరోల్పై విడుదలయ్యారు. 2024 అక్టోబర్ 5న హర్యనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 1న 20 రోజుల పెరోల్పై బయటకు వచ్చారు. 2024 ఆగస్టులోనూ 21 రోజుల పెరోల్ లభించింది. దానికి ముందు 2022 ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలకు ముందు కూడా మూడు వారాలపాటు ఆయన జైలు బయటకు వచ్చారు.
పెరోల్ పై సిక్కు సంస్థల అభ్యంతరం
డేరా బాబాకు తరచు పెరోల్, సెలవులు మంజురు చేయడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీతో సహా పలు సిక్కు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో పలుమార్లు విడుదలైన సమయంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోని డేరా భగత్ ఆశ్రమంలోనే ఆయన బస చేసేవారు. సిర్సాకు చెందిన డేరా సచ్ఛా సౌదాకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది.





