Galwan War Memorial in Ladakh: గల్వాన్లో చైనాతో ఘర్షణ జరిగిన ఐదేళ్ల తర్వాత భారత్.. లద్దాఖ్లోని దౌలత్ బేగ్ ఓల్డీ మార్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో యుద్ధస్మారకాన్ని నిర్మించింది. 2020 జూన్ 15 రాత్రి సమయంలో చైనా బలగాలతో వీరోచిత పోరాటం చేసి అమరులైన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు.
త్యాగం, వీరత్వానికి ప్రతీకగా..
భారత్ రణ్భూమి దర్శన్ కార్యక్రమం కింద.. త్యాగం, వీరత్వానికి ప్రతీకగా ఎరుపు, నలుపు రంగు గ్రానైట్ రాళ్లతో త్రిశూలం-ఢమరుకం ఆకారంలో ఈ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఈ కాంప్లెక్స్ లో మ్యూజియం, డిజిటల్ గ్యాలరీ, గల్వాన్ ఘటన వివరాలు, లడక్ సైనిక చరిత్రను తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఆడిటోరియం కూడా నిర్మించారు. మరోవైపు చైనాలోని షాంఘైలో భారత్ కొత్త కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ దీనిని ప్రారంభించారు.
గాల్వాన్ ఘర్షణలో 20 జవాన్లు వీరమరణం
2020 జూన్ 15న రాత్రి భారత్ చైనా దళాల మధ్య గల్వాన్ లో భీకర ఘర్షణ జరిగింది. నిరాయుధులైన భారత జవాన్లపై చైనా సైనికులు సాయుధ దాడికి దిగారు. అయినా సరే, భారత జవాన్లు వెన్ను చూపలేదు. ప్రాణాలకు ఎదురొడ్డి నిలిచారు. ఈ వీరోచిత పోరాటంలో భారత సైనికులు అమరులయ్యారు. గల్వాన్ లోని భారత భూభాగంలో ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి, తెలంగాణకి చెందిన కల్నల్ సంతోష్ బాబు జవాన్లతో కలిసి వెళ్లారు. చైనా తన శిబిరాలను తొలగించకపోవడంతో సంతోష్ బృందం వాటిని నేలమట్టం చేసింది. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది జవాన్లు అమరులయ్యారు.





