Future of Warfare: మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా భారత సైన్యం అప్ డేట్ అవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అస్త్రాలతో సరికొత్త దళాన్ని రెడీ చేస్తోంది. ఇప్పటి వరకు లేని విధంగా సైన్యంలో లక్ష మందికిపైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ సైన్యాన్ని తయారు చేస్తోంది. శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు భైరవ పేరుతో స్పెషల్ ఫోర్స్ ను రెడీ చేస్తోంది.
రాజస్థాన్ ఎడారిలో భైరవ బెటాలియన్ల ఏర్పాటు
రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో భైరవ బెటాలియన్లను ఏర్పాటు చేశారు. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో.. భైరవ్ ఏర్పాటు చేసింది ఇండియన్ ఆర్మీ. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్ ఫోర్సె్సకి మధ్య వారధిలా పని చేస్తుంది. బహుళ స్థాయిల్లో అత్యంత వేగంగా, దూకుడుగా దాడి చేయడం భైరవ దళం స్పెషాలిటీ. ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లు ఆపరేటింగ్, యుద్ధంలో వాటి వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. భారత సైన్యం ఇప్పటికే 15 బెటాలియన్లను ఏర్పాటు చేసింది. వాటిని పాక్, చైనా సరిహద్దుల్లోని వివిధ దళాలకు కేటాయించింది. భవిష్యత్తులో వీటిని 25 బెటాలియన్లకు పెంచాలని ఇండియన్ ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది.
రాజస్థాన్లో కఠోర శిక్షణ
ప్రస్తుతం రాజస్థాన్లో ఈ దళం 5 నెలలుగా కఠోర శిక్షణ తీసుకుంటోంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడి వాతావరణం, భాష, భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక యువకులనే ఈ బెటాలియన్లో ఎక్కువగా చేర్చుకున్నారు. ఈ ఏడాది జనవరి 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే పరేడ్లో భైరవ దళం తొలిసారిగా కవాతు చేయనుంది. భైరవ్ మాత్రమే కాదు.. రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో శక్తిమంతమైన వ్యవస్థను కూడా భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇందులో పదాతిదళం, టెక్నికల్ యూనిట్లు, ట్యాంకులు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, డ్రోన్ వ్యవస్థలన్నీ ఉంటాయి. ఇదొక సంపూర్ణ యుద్ధ వ్యవస్థగా రూపుదిద్దుకోనుంది.





