క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది. గత కాంగ్రెస్ తీరుకు భిన్నంగా పాలన ఇప్పటివరకు సాఫీగా సాగింది. చిన్న చిన్న ఘటనలు మినహా సీఎం, మంత్రులు కలిసికట్టుగా పని చేశారనే టాక్ వచ్చింది. అయితే తాజాగా మంత్రుల మధ్య వార్ మొదలైందని తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులు మంత్రుల మధ్య చిచ్చు రాజేశాయని అంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే వేళ తమను సంప్రదించలేదంటూ గుర్రుగా ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లాకు చెందిన మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సన్నిహితులకే పదవులు దక్కాయని.. ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది తప్పించి.. తమను పట్టించుకోవటం లేదన్న కినుకుతో పొన్నం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నేరెళ్ల శారద.. కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకంపై పొన్నం ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తన సొంతజిల్లాకు చెందిన అంశాల్ని తనతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ పై ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న దీపాదాస్ మున్షీ వద్ద పొన్నం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
Read More : మర్రికి మల్కాజ్ గిరి కాంగ్రెస్ టికెట్?
పొన్నంను పక్కన పెట్టేసి మరో మంత్రి శ్రీధర్ బాబు అనుకూల వర్గానికి పెద్ద పీట వేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సుడా ఛైర్మన్ పదవి పొందిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించే ప్రయత్నం చేశారని.. అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఎలా కట్టబెడతారన్నది పొన్నం ప్రశ్నగా చెబుతున్నారు. నామినేటెడ్ పదవులు పొందిన వారంతా శ్రీధర్ బాబుకుసన్నిహితులు కావటం వల్లే పదవులు కట్టబెట్టారంట పొన్నం ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి …