క్రైమ్

బైక్ కింద పడి భార్య మృతి.. యాసిడ్ తాగి భర్త సూసైడ్

ద్విచక్రవాహనంపై నుంచి పడి గర్భిణి మృతి చెందగా అది తట్టుకోలేక భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో చోటు చేసుకొంది.ఏడాది క్రితం ఏడడుగుల బంధంతో ఒక్కటైనా జంట రోడ్డు ప్రమాదంలో బార్య మృతి చెందడంతో మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది.

కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన మంగలి సునీల్(30)కు గతేడాది మద్నూర్ మండలం పెద్దతడూర్ గ్రామానికి చెందిన జ్యోతి(27)తో వివాహమైంది. ఆమె ఐదు నెలల గర్భిణి కాగా ఈ నెల 14న బిచ్కుందలో బంధువుల సమక్షంలో సంబరంగా సీమంతం నిర్వహించారు. అనంతరం జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చారు. శుక్రవారం ఉదయం తిరిగి బిచ్కుందకు తీసుకొచ్చేందుకు భర్త సునీల్ వెళ్లారు. భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద వాహనం వేగం కారణంగా జ్యోతి జారి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందారు.

శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకురాగా ఇంటి వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విగతజీవిగా మారిన భార్యను చూసి తీవ్ర మనోవేదనకు గురైన సునీల్ బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగారు. బయటకు వచ్చి వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. భార్యభర్తల మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button