
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- వివాహేతర సంబంధాల కారణంగా భర్త భార్యను, భార్య భర్తను హతమార్చిన ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చున్నీతో ఉరేసి చంపాడు భర్త. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కొమ్మనపల్లికి చెందిన మరియా దాస్, అమృత దంపతులు గత మూడేళ్లుగా సరూర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే తరుచూ వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధాల గురించి గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఇవాళ భార్య అమృత ఫోన్ మాట్లాడుతుండగా.. ఇద్దరి మధ్య మరోసారి వివాదం జరిగింది.
ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో విచక్షణ కోల్పోయిన మరియు దాస్ దారుణానికి ఒడిగట్టాడు. భార్యను చున్నీతో ఉరేసి చంపాడు. ఆ తర్వాత నేరుగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు నిందితుడి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.