
Flood waters In Srisailam And Nagarjuna Sagar: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి ఏకంగా 3.17 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 3.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.70 అడుగుల మేర నీరు ఉంది. అటు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.96టీఎంసీల మేర నీరు ఉంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద
అటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2.82లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. అధికారులు 26 గేట్లు ఎత్తి 2.43 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.10 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్ట 312.04 టీఎంసీలు కాగా, 297.7 టీఎంసీలు ఉన్నాయి. మరికొన్ని రోజులపాటు వరద కొనసాగే అవకాశం ఉంద ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పులిచింతలకు 2.14 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 2.04లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.
నిండుకుండల్లా కృష్ణా ప్రాజెక్టులు
కృష్ణా బేసిన్ లో ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.52లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 1.40లక్షల క్యూసెక్కులుగా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.35లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే… ఔట్ఫ్లో 1.08లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జూరాలకు 2.01లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 2.08 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. తుంగభద్రకు 40వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా… 32వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
Read Also: అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఎప్పుడంటే?